టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన రైతు పోరుబాట పాదయాత్ర రేపు ఉదయం మొదలు కానుంది.. ఈ నేపథ్యంలో ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి బయల్దేరారు.. తణుకు నియోజకవర్గంలోని ఇరగవరంలో సాయంత్రం రైతులతో రచ్చబండ నిర్వహించనున్నారు.. రాత్రి ఇరగవరంలోనే బస చేయనున్న చంద్రబాబు.. రేపు ఉదయం 7 గంటలకు పాదయాత్ర మొదలు పెట్టనున్నారు.. ఇరగవరంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం నుంచి చంద్రబాబు రైతు పోరుబాట పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇరగవరం నుంచి తణుకు వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. అటు చంద్రబాబు పాదయాత్ర కోసం పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు తణుకు తరలివస్తున్నారు.
ఇటీవల ఉభయగోదావరి జిల్లాల్లో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.. స్వయంగా పొలాల్లోకి వెళ్లి పంట నష్టాన్ని పరిశీలించారు.. రైతులతో మాట్లాడారు.. వారికి భరోసా కల్పించారు.. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు.. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టారు.. ఆ డెడ్లైన్ ముగియడంతో రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నారు చంద్రబాబు.. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇరగవరం నుంచి తణుకు వరకు పాదయాత్ర చేపట్టనున్నారు.