లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఏపీలో లిక్కర్ సరఫరాలో పారదర్శకతను తగ్గించేందుకు ఆన్లైన్ విధానాన్ని మాన్యువల్ మోడల్గా మార్చడంలో ఆయన కీలకపాత్ర పోషించినట్టు సిట్ వాదించింది. అంతేకాకుండా లావాదేవీలను తన నియంత్రణలోకి తీసుకున్నట్టు తెలిపింది. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా పర్మిషన్ ఇచ్చారని.. దీనివల్ల ప్రభుత్వానికి రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు.
ఈ స్కాంలో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్గా ఉన్నారంటూ సాక్షుల ఇచ్చిన వాంగ్మూలాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఆయన ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని, విచారణకు సహకరించడం లేదని సిట్ వాదించింది. మరోవైపు మిథున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. లిక్కర్ విధానానికి మిథున్కు సంబంధం లేదని, షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది.