CBN: ఇంటింటికీ "తొలి అడుగు" విజయ యాత్ర

పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటుకు ఆదేశం.. 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు ఆదేశం;

Update: 2025-06-14 03:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా కూటమి పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు... పార్టీ శ్రేణులకు సూచించారు. ఈనెల 23 నుంచి పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లి.. అమలు చేసిన ప్రతి హామీని వివరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం చంద్రబాబు... ఏడాది పాలన విజయాలను, సూపర్‌-6 హామీలు దాదాపు అమలు చేశామనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ యాత్ర ద్వారా... ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ‘‘అమలు చేసిన ప్రతి హామీని ప్రజలకు వివరించాలి. చేసిన మంచిని చెప్పుకోవడంలో విఫలం కాకూడదు. పార్టీ సంస్థాగత కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

సంక్షేమ పథకాల జోరు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేశామని, ఎంతమంది పిల్లలున్నా ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరేలా నిధులు విడుదల చేశామని సీఎం తెలిపారు. "మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థులకు గాను, తల్లుల ఖాతాల్లోకి రూ.13,000 చొప్పున, పాఠశాలల అభివృద్ధికి రూ.2,000 చొప్పున జమ చేస్తున్నాం. ఈ పథకం కింద రూ.8,747 కోట్లు కేటాయించామని చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసి రూ.5,540 కోట్లు ఖర్చు చేస్తే, మనం అదనంగా 25 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తూ, ఏటా రూ.3,205 కోట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు. నలుగురు పిల్లలు ఉన్న తల్లికి రూ.52,000 అందుతాయని, ఇంత పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నా కొందరు బుద్ధి, జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని ఈ నెల 20వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

యోగా దినోత్సవానికి ఏర్పాట్లు

ఏపీలో 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని 5 లక్షల మందితో నిర్వహించనున్నామని సీఎం తెలిపారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పాల్గొనేలా లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటికే 2.21 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. "యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణమే మన లక్ష్యం. నేడు లక్ష చోట్ల యోగా దినోత్సవ సన్నాహక కార్యక్రమాలు జరుగుతాయి" అని వెల్లడించారు. జూలై నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులకు నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని, కార్యకర్తలను సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, ఎమ్మెల్యేలు కూడా ప్రతిరోజూ పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించి, ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు.

Tags:    

Similar News