CBN: రికార్డులు సరి చేసేందుకే సింగపూర్కు వచ్చా
సింగపూర్లో చంద్రబాబు బిజీబిజీ.... చంద్రబాబు కీలక ఒప్పందాలు;
ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు. ప్రస్తుతం సింగపూర్ లో పర్యటిస్తున్న ఆయన.. కీలక ఒప్పందాల దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎన్నో అంశాలను చర్చించినట్లుగా తెలుస్తోంది. అభివృద్ధి రంగంలో వేగంగా దూసుకుపోతున్న సింగపూర్ అంటే తనకు ఎంతో అభిమానమని, సింగపూర్ ను ఆదర్శంగా తీసుకుని గతంలో తాను హైదరాబాద్ లో టౌన్ షిప్ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. సింగాపూర్ ను చూసిన తరువాతనే హైదరాబాద్ లో రాత్రి పూట రోడ్లు కార్యక్రమం మొదలు పెట్టినట్లు వ్యాఖ్యానించారు. మానవ వనరుల విషయంలోను, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలోను సింగపూర్ తో భాగస్వామ్యం చాలా అవసరమన్న సీఎం.. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలతో భాగస్వామ్యం చాలా అవసరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిస్థాయిలో కుంటుపడిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ముఖ్యంగా సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావని, వాటిని పరిష్కరించేందుకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతుందని, పోర్టులు, లాజిస్టిక్ రంగాల్లో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సహాయం చేయాలని మంత్రి టాన్ సీ లెంగ్ ను కోరారు.
ఏపీతో భాగస్వామయానికి సిద్ధం
ఏపీతో కలిసి ముందుకెళ్లడానికి తాము సిద్ధమని సింగపూర్ వాణిజ్య మంత్రి టాన్ సీ లెంగ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, సబ్ సీ కేబుల్ రంగాల్లో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పని చేయడానికి తాము సిద్ధం అంటూ టాన్ సీ లెంగ్ తెలిపారు. కాగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్ పర్యటన ఎంతగానో దోహద పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటన రెండో రోజు కొనసాగుతుండగా.. మంత్రి టాంగ్ తో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.