CBN: నదులు అనుసంధానిస్తాం.. ప్రతీ ఎకరాకు నీళ్లిస్తాం
వైఎస్సార్ కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన.. అన్నదాతా సుఖీభవ రెండో విడత నిధులు విడుదల.. కడప గడ్డ మీద టీడీపీ సత్తా నిరూపించామన్న సీఎం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో భాగంగా కడప జిల్లా చిన్నదాసరిపల్లిలో చంద్రబాబు రెండో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశామన్నారు. నాడు ఇచ్చిన హామీల అమలు సాధ్యమా అని అందరూ అనుకున్నారని.. కానీ సూపర్ సిక్స్ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేసి విజయవంతంగా నెరవేర్చామన్నారు. రైతన్నకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పామని, ఇప్పటికే మొదటి విడతలో రైతుల అకౌంట్లలో రూ.7 వేలు జమ చేశామన్నారు. ఇవాళ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు కూడా జమ చేశామని తెలిపారు. 46.85 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. "మహానాడు ద్వారా కడప గడ్డ మీద తెదేపా సత్తా ఏంటో నిరూపించారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం. హమీల అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. ఇప్పటి వరకు 46.85లక్షల మంది రైతులకు రూ.14 వేల చొప్పున జమ చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాం. రైతుల పట్ల మా ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం." అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. ఇచ్చిన ప్రతీ హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.
సాగు మారాలి
సాగు తీరు మారాలి.. వ్యవసాయం లాభసాటి కావాలి. అన్నదాతల బతుకులు మారాలి. ప్రకృతి సేద్యంలో ఎవరు ముందుంటే.. వారిదే భవిష్యత్తు. రైతుల అభివృద్ధి కోసం పంచసూత్రాలు తీసుకొచ్చాం. వాటిని అమలు చేస్తే.. రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నేనూ రైతు బిడ్డనే.. మా నాన్నకు వ్యవసాయంలో సహాయం చేసేవాడిని. పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తామంటే.. రైతుకు ఇబ్బందులు వస్తాయి. రైతులు డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేయాలి. మనం పండించిన పంటలను ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలి. అలా అయితేనే రైతులకు ఆదాయం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం. కృష్ణా, గోదావరితో పాటు అనేక నదులు ఉన్నాయి. నదుల అనుసంధానం ద్వారా అన్ని రిజర్వాయర్లలో నీళ్లు నింపగలిగితే.. ఒక ఏడాది వర్షం పడకపోయినా బ్యాలెన్స్ అవుతుంది. అన్ని చెరువులు నింపాలి, భూగర్భ జలాలు పెంచాలి. భూమిని ఒక జలాశయంగా మార్చాలి. మనం పండించిన పంటలను ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలి. అలా అయితేనే రైతులకు ఆదాయం వస్తుంది. భవిష్యత్తులో మూడో విడత రూ.6 వేలు కూడా రైతుల అకౌంట్లలో వేస్తామని భరోసా ఇచ్చారు.’’ అని సీఎం అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.