Chandrababu: కడపలో చంద్రబాబు బహిరంగ సభకు ఏర్పాటు.. బాదుడే బాదుడు నిరసనల్లో భాగంగా..

Chandrababu: బాదుడే బాదుడు నిరసనల్లో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాకు వెళ్తున్నారు.

Update: 2022-05-17 15:53 GMT

Chandrababu: బాదుడే బాదుడు నిరసనల్లో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాకు వెళ్తున్నారు.. బుధవారం ఉదయం 10.30కు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.. మొదట ఉమ్మడి కడప జిల్లా నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమవుతారు. ఈ సమావేశం కడప నగర శివారులోని DS కల్యాణ మండపంలో జరుగుతుంది..

అనంతరం ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి చెన్నూరు, ఖాజీపేట మీదుగా కమలాపురం చేరుకుంటారు.. కమలాపురంలో బాదుడే బాదుడు నిరసనలో పాల్గొంటారు. కమలాపురంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మోసాలను, రైతులకు జరుగుతున్న అన్యాయాలను, సంక్షేమ పథకాల ఎత్తివేతల గురించి ప్రజలకు తెలియజేయనున్నారు.. ఆ తర్వాత స్థానిక చావిడి వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు..

టీడీపీ అధినేత పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను చిన్నరాజప్ప పరిశీలించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనడానికి ఎమ్మెల్యేల నిలదీతే నిదర్శనమన్నారు చినరాజప్ప. సీఎం జగన్‌ అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. ఇక బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు, ఓటరు వెరిఫికేషన్‌తోపాటు ఈ నెలాఖరులో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు చంద్రబాబు..

ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ముందస్తు ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో రోజురోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు.. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని సీఎం జగన్‌కు కూడా అర్థమవుతోందన్నారు. జగన్‌ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా బూటకమేనని ప్రజలకూ అర్థమవుతోందన్నారు చంద్రబాబు.

ఆ వర్గం, ఈ వర్గం అని లేకుండా అందరిలోనూ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తోందన్నారు.. వీటన్నింటినీ గమనించిన జగన్‌ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నారని చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారు.. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు టీడీపీపైనే ఆశలు పెట్టుకున్నారన్నారు.. గ్రామాల్లో టీడీపీకి స్వాగతాలు, గడప గడపలో వైసీపీ నేతలకు నిలదీతలే ఇందుకు నిదర్శనమన్నారు.. బాదుడే బాదుడు కార్యక్రమంలో గ్రామ స్థాయి వరకు ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా ఇంటింటికీ వెళ్లాలని టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు సూచించారు.

Tags:    

Similar News