బూతుల మంత్రి 271 ఓట్లతో సొంత గ్రామంలో ఓడిపోయరు: చంద్రబాబు

బూతుల మంత్రి సొంత గ్రామంలో ఓడిపోయారు. ఎంపీ పిల్లి సుభాష్‌‌కు కూడా స్వగ్రామంలో ఓటమి తప్పలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Update: 2021-02-14 12:09 GMT

పంచాయతీ ఎన్నికల్లో.. వైసీపీ మంత్రులు, నేతల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బూతుల మంత్రి 271 ఓట్లతో సొంత గ్రామంలో ఓడిపోయారని అన్నారు. ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు కూడా స్వగ్రామంలో ఓటమి తప్పలేదని ఎద్దేవా చేశారు.

మంత్రి గౌతమ్‌రెడ్డి, నర్సీపట్నం ఎమ్మెల్యే స్వగ్రామాల్లోనూ టీడీపీ మద్దతుదారులు గెలిచారని చెప్పారు. వైసీపీ నేతలు చాలా చోట్ల దౌర్జన్యాలకు దిగారని.... టీడీపీ అనుచరులపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. అయినా టీడీపీ మద్దతుదారులు ఎదురొడ్డి బరిలో నిలిచారని అభినందించారు. చాలా చోట్ల ఏజెంట్లను బయటకు పంపి ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. 20 నెలలు రాష్ట్రంలో సైకో రాక్షసుల పాలన నడుస్తోందని నిప్పులు చెరిగారు.

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. గ్రామ వాలంటీర్లతో ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. వాలంటీర్లకు ఎమ్మెల్యేలు ఎన్నికల శిక్షణ ఇస్తారా అని అన్నారు. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తారా అని మండిపడ్డారు. వైసీపీ అరాచకాలకు లెక్కే లేకుండా పోయిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ ఊరికో ఉన్మాదిని తయారు చేసి... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు. సాయంత్రం వరకు టీడీపీ మద్దతుదారులు గెలిచారని తెలిపారు. కానీ చీకటి పడగానే ఫలితాల్ని తారుమారు చేశారని ఆరోపించారు. రీ కౌంటింగ్‌ పేరుతో వైసీపీ మద్దతుదారుల్ని గెలిపించారని విమర్శించారు. రాత్రిపూట కరెంట్ కట్‌చేసి.... ఫలితాల్ని తలకిందులు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

నేరాలు-ఘోరాలు చేయడంలో వైసీపీ నేతలు ఆరితేరారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. కొన్ని చోట్ల పోలీసులు, అధికారులు కూడా బరి తెగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అరాచకాల్ని కోర్టుల ద్వారా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు.

పీలేరు, తంబళ్లపల్లె, మాచర్లలో ఏకగ్రీవాలు.. పులివెందుల అరాచకాల్ని మంచిపోయాయని తెలిపారు. ఇష్టారాజ్యంగా అరాచకాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ విజయాలతో మంత్రులకు చెమటలు పడుతున్నాయని ధ్వజమెత్తారు. రౌడీయిజంతో పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించారు. ఉన్మాదులకు తెలుగుదేశం పార్టీ భయపడదని..మంత్రులు బెదిరిస్తే భయపడాల్సిన అవసరం లేదని శ్రేణులకు పిలుపునిచ్చారు.



Tags:    

Similar News