ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఆధార్ తరహాలో ఈ కార్డును రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పథకాల రీడిజైన్, పాపులేషన్ పాలసీ
ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలని, వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ‘‘కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయి సమాచారం సేకరించాలి. ప్రభుత్వ సంక్షేమం అవసరమైతే వెంటనే వారికి అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలి’’ అని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకుండా చూడాలని, అందరికీ లబ్ధి కలిగేలా పథకాలను రీడిజైన్ చేసే అంశాన్ని పరిశీలిద్దామని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు.