ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ప్రతి నెలా అందించే సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో రూ.7వేలు అర్చకుడి భృతిగా, రూ.3వేలు పూజలకు వినియోగించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని అర్చకుడి ఖాతాలోనే జమ చేస్తామంది. దీనివల్ల రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.32.40 కోట్ల భారం పడనుంది. దీనిని దేవాదాయశాఖకు చెందిన సర్వ శ్రేయో నిధి (సీజీఎఫ్) నుంచి వినియోగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఆదాయం లేని చిన్న ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ధూప, దీప, నైవేద్యం పథకం (డీడీఎన్ఎస్) అమలు చేస్తున్నారు. గతంలో నెలకు రూ.2,500 చొప్పున అందిస్తుండగా 2015లో టీడీపీ ప్రభుత్వం దీనిని రూ.5 వేలకు పెంచింది. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని కూటమి నేతలు ఇటీవల ఎన్నికల ముందు హామీ ఇచ్చారు