పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో గ్రావెల్ అక్రమ మైనింగ్?
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కాపవరంలో టీడీపీ నిజనిర్ధారణ బృందం పర్యటించింది.. పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు..
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కాపవరంలో టీడీపీ నిజనిర్ధారణ బృందం పర్యటించింది.. పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీ బృందం అక్కడకు వెళ్లింది.. నాగార్జున ఫెర్టిలైజర్స్కు సంబంధించిన 200 ఎకరాల భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది ప్రభుత్వం.. అయితే, ఈ స్థలం చదును చేయడం కోసమంటూ కాంట్రాక్టు తీసుకుని ఇక్కడి గ్రావెల్ను మరో ప్రాంతానికి తరలించడం దుమారం రేపింది.. వేలకు వేలు లారీల గ్రావెల్ తరలించడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపింది మైనింగ్ మాఫియా.. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామృష్ణారెడ్డి అధికారులకు కంప్లయింట్ చేసినా ఎలాంటి ఫలితం లేదు.. విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్ శాఖ అధికారులు మాఫియాతో చేతులు కలిపి అక్రమాల్లో భాగమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వాస్తవాలు తెలుసుకోవాలంటూ నేతలకు సూచించారు.. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతల బృందం గ్రామంలో పర్యటించింది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు, ఉండి ఎమ్మెల్యే కలవపూడి రామరాజు, ఎమ్మెల్సీ రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు జవహర్, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు మండలం కాపవరంలో పర్యటించి వాస్తవాలను పరిశీలించింది.. తక్షణమే అధికారులు విచారణ చేపట్టి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.