ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకంలో గత జగన్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ఆరోపించారు. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. మొత్తం రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు ఇచ్చిన నివేదికల ద్వారా వెల్లడైందని పవన్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు 564 మండలాల్లో ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించిందని తెలిపారు. ఈ పరిశీలనలో అనేక అవకతవకలు బయటపడ్డాయని, ఉపాధి హామీ కింద ఖర్చు చేసిన నిధులపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ద్వారా వచ్చిన నిధులు లబ్ధిదారులకు చేరకుండా కొందరు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లాయని డిప్యూటీ సీఎం ఆరోపించారు.