Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓటర్ల రచ్చ..
Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో దొంగ ఓట్లర్లు దిగబడ్డారు.
Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దొంగ ఓట్లర్లు మాత్రం కుప్పంలో కుప్పలుతెప్పలుగా దిగబడ్డారు. రాత్రి నుంచి కుప్పం మున్సిపల్ పరిధిలోనే మకాం వేసిన దొంగ ఓటర్లు.. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశిస్తున్నారు. దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించిన యువకులను పట్టుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. 18వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన వారిని టీడీపీ ఏజెంట్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
16వ వార్డులోనూ దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని టీడీపీ శ్రేణులు వెంటాడాయి. పుంగనూరు నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లు వచ్చినట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఫేక్ ఐడీ కార్డులతో పోలింగ్ కేంద్రాల్లోకి వస్తున్న వారిని గుర్తించి పోలీసులకు అప్పగిస్తున్నారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లు అనంతపురం, రాయచోటి నియోజకవర్గాలకు చెందిన వారిగా గుర్తించారు. ముఖ్యంగా మహిళా దొంగ ఓటర్లను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే, టీడీపీ కార్యకర్తలు మహిళా దొంగ ఓటరును గుర్తించి, పోలీసులకు అప్పగించారు. మరోవైపు కుప్పంలోని విజయవాణి ప్రైవేట్ స్కూల్లో మహిళా దొంగ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు వెళ్లిన టీడీపీ శ్రేణులపై ఎదురుదాడి చేసినప్పటికీ.. పోలీసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో ఎన్నడూ చూడనటువంటి పోకడలు, వింతలు చూస్తున్నారు కుప్పం ఓటర్లు. క్యూలైన్లలో నిల్చున్న కుప్పం ఓటర్లకు కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఒక్కో దొంగ ఓటరును జల్లెడపట్టి బయటకు లాగుతుంటే.. కుప్పం ఓటర్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు. దశాబ్దాలుగా ఓ ప్రశాంత వాతావరణంలో ఓటు వేసిన అనుభవం ఉన్న కుప్పం ఓటర్లకు ఈ పరిణామాలు ఒకింత షాకింగ్గా ఉన్నాయి. గతంలో ఎన్నడూ ఇంత మంది దొంగ ఓటర్లను చూడలేదంటున్నారు.
బస్సుల్లో, కార్లలో, ఇతర వాహనాల్లో వందలకు వందల మంది దొంగ ఓటర్లను దింపి, ఇలా ఓట్లు వేయించడం ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. వేరే నియోజకవర్గాల్లోనూ, గత స్థానిక ఎన్నికల్లోనూ అధికార పార్టీ నేతలు దొంగ ఓటర్లను దింపారనే వార్తలను వినడమే తప్ప.. ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా అలాంటి వ్యక్తులను చూడలేదంటున్నారు కుప్పం ఓటర్లు. నిజంగానే పులివెందుల రాజకీయాలు కుప్పంలో ప్రవేశించాయనే అభిప్రాయానికి వస్తున్నారు.