ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ డల్లాస్ చేరుకున్నారు. ఆయనకు అక్కడి ప్రవసాంధ్రులు ఆత్మీయ స్వాగతం పలికారు. నాలుగు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్న ఆయన.. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. నేడు డల్లాస్ లో తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొననున్నారు. డల్లా్సలోని గార్లాండ్లో ప్రవాసాంధ్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినందుకు ప్రవాసాంధ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపేందుకు ఈ వేదికను వినియోగించుకోనున్నారు. ఏపీ ఎగుమతులు-దిగుమతుల వాణిజ్యాన్ని బలోపేతం చేసే పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో లోకేశ్ సోమ, మంగళవారాల్లో శాన్ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తారు. ఆయన పర్యటన ఏర్పాట్లను ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ డాక్టర్ వేమూరు రవికుమార్, ఎన్నారై టీడీపీ సమన్వయకర్త కోమటి జయరాం, లోకేశ్ నాయుడు కొణిదెల, రాజా పిల్లి, సతీశ్ మండువ తదితరులు సమన్వయం చేస్తున్నారు.