భయం అనేది టీడీపీ బ్లడ్లో కూడా లేదు : నారా లోకేష్..!
టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు కృష్ణా జిల్లాలో విస్తృతంగా పర్యటించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో పర్యటించారు.;
టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు కృష్ణా జిల్లాలో విస్తృతంగా పర్యటించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ గడ్డి కృష్ణారెడ్డి దంపతులను పరామర్శించారు. దాడి వివరాలను కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. లోకేష్ వెంట విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ నెట్టెం రఘురామ్, మాజీ మంత్రులు దేవినేని ఉమ, జవహర్తో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. అయితే లోకేష్ రాక తెలిసి అక్కడ.. విద్యుత్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇక గొల్లమంద చేరుకున్న లోకేష్.. వైసీపీ నాయకుల దాడిలో మరణించిన సోమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కుటుంబానికి భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో మహిళలు, దళితులకు భద్రత లేదన్నారు లోకేష్. వైసీపీ అరాచక చర్యలన్నీ గుర్తుపెట్టుకున్నామని.. భవిష్యత్తులో అధికారులు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని లోకేష్ హెచ్చరించారు.
సొంత ఊరుపేర్లు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మంత్రులు ఉన్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలను బెదిరించి గెలుపొందాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారని.. వారికి త్వరలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని లోకేష్ అన్నారు. నారా లోకేష్ రాక సందర్భంగా కృష్ణా జిల్లా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. లోకేష్ కాన్వాయ్ వెంటే బైక్ ర్యాలీలో క్యాడర్ అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. దారిపొడవునా అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు లోకేష్. కార్యకర్తలందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.