LOKESH: జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం
శంఖారావం సభలో నిప్పులు చెరిగిన లోకేశ్.... వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు;
జగన్ను ఇంటికి పంపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని... తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జోస్యం చెప్పారు. మలి విడత ఎన్నికల ప్రచారాన్ని ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించారు. ఇచ్ఛాపురం, పలాసలో నిర్వహించిన శంఖారావం సభలో వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగ యువకులను సీఎం జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే... సీఎం జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని ఇచ్ఛాపురం సభలో లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన కుటుంబ సభ్యులకే రక్షణ కల్పించట్లేదని లోకేష్ విమర్శించారు. 2019 ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో D.S.C.ఇస్తామన్న సీఎం జగన్ మాట తప్పారని లోకేష్ మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా D.S.C. నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమాలను బయటకు తీస్తామని పలాస సభలో లోకేష్ చెప్పారు. పలాసలో జీడిపిక్కకల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న లోకేష్... వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఐదేళ్ల జగన్ వైసీపీ పాలనలో ప్రజలు మోసపోయారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం నాలుగన్నరేళ్ల పాలనలో మంత్రి సీదిరి అప్పలరాజు తెలుగుదేశం కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని గౌతు శిరీష ధ్వజమెత్తారు.
వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో D.S.C.ఇస్తామన్న జగన్ మాట తప్పారని లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ సర్కారు తెలుగుదేశం శ్రేణులపై దొంగ కేసులు పెట్టి వేధించిందన్న లోకేశ్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమాలను బయటకు తీస్తామని పలాస సభలో చెప్పారు. వైసీపీ సర్కారు రద్దుచేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామన్న లోకేశ్ బాబు సూపర్ సిక్స్ హామీలను అమలుచేస్తామని టెక్కలి సభలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని లోకేశ్ హామీఇచ్చారు.
‘జగన్ ఇటీవల ‘సిద్ధం’ అంటున్నారు. దేనికి సిద్ధం? జైలుకు వెళ్లడానికా? బాబాయ్నే చంపేసిన మీరు.. ఇంకొంత మంది కుటుంబసభ్యులను లేపేయడానికా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికా? విశాఖలో భూకబ్జాలకు సహకరించలేదని తహసీల్దారు రమణయ్యను కిరాతకంగా చంపేశారు. బాపట్ల ఆర్బీకేలో వ్యవసాయ అధికారి పూజితను బలిగొన్నారు. బీసీ బిడ్డ అమర్నాథ్గౌడ్, దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్, మైనారిటీ బాలిక మిస్బానీని హతమార్చిన జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలే సిద్ధంగానే ఉన్నారు’ అని లోకేశ్ పేర్కొన్నారు.