శాంతియుతంగా ర్యాలీ చేస్తే అరెస్టులు చేస్తారా- నారా లోకేష్

Nara Lokesh: అమరావతి రైతులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Update: 2021-08-08 14:30 GMT

అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి. 600వ రోజు అమరావతి రైతులు, మహిళలు, జేఏసీ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే అమరావతి పోరాటంపై పోలీసులు ఆంక్షల పంజా విసిరారు. అడుగడుగునా రైతులు, మహిళలు, జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులతో నిరసనకారులను నిర్బంధించి జులుం ప్రదర్శించారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటూ మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు.. రైతుల ఆందోళన.. అటు పోలీసుల ఆంక్షలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

అమరావతి రైతులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరసనకారులను ఫోన్‌లో పరామర్శించిన నారా లోకేష్.. రాజధాని రైతులు, మహిళలు శాంతియుతంగా ర్యాలీ చేస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు.

దొండపాడు, కృష్ణాయపాలెం, మందడం సహా అన్ని చోట్లా అరెస్టుల్ని నిరసిస్తూ.. JAC ప్రతినిధుల ఆదోళనలు హోరెత్తాయి. మూడు రాజధానులను నిరసిస్తూ ర్యాలీ చేపట్టిన రైతులు, జేఏసీ నేతలను అరెస్టు చేసి పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు. రాజధాని కోసం తాము ఉద్యమం చేస్తుంటే.. అక్రమంగా అరెస్టులు చేయడమేంటని జేఏసీ నేతలు నిలదీస్తున్నారు. పాలకుల ఆదేశాల అమలు పేరుతో ఉద్యమాన్ని అడ్డుకోవద్దని రైతులు, మహిళలు, జేఏసీ నాయకులు పోలీసులను కోరారు. 



Tags:    

Similar News