Pawan Kalyan : నెలలో ఒక రోజు జనంలో ఉండండి.. పవన్ ఆదేశాలు

Update: 2024-07-13 07:11 GMT

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలతోపాటు తనతో సహా మొత్తం 21 మంది శాసనసభ్యులు నెలలో ఒక రోజైనా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఒక పూట తమ నియోజకవర్గాల నుంచి వచ్చే వారికి, మరోపూట అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వారిని కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ఈ నిబంధనను తక్షణమే ప్రతి ఒక్కరు పాటించాలని జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. ఈనెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ ను కలిశారు. జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు తనను కలిసేందుకు వచ్చినప్పుడు పుష్పగుచ్ఛాలు తేవద్దనీ... కూరగాయలే తేవాలని ఇప్పటికే పవన్ ఆదేశాలు ఇవ్వడంతో నేతలు అదే పాటించారు. బొకేకు బదులుగా కూరగాయల బుట్టను ఆయనకు వారు అందజేశారు. ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన ఎంపీలను పవన్ అభినందించారు. తనను కలిసేందుకు వచ్చేవారు విగ్రహాలు, బొకేలు, శాలువాలు కాకుండా తిండికి పనికొచ్చేవి తేవాలన్నారు.

Tags:    

Similar News