AP: తొలిసారే గెలిచి కేంద్రమంత్రి అయిన పెమ్మసాని
వైద్య రంగంలో ఉన్నస్థానాలనకు ఎదిగిన పెమ్మసాని.. టీడీపీ తరపున భారీ మెజార్టీతో గెలుపు;
తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి దక్కించుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మసాని అమెరికాలో స్థిరపడి వైద్యరంగంలో ఉన్నతస్థానాలకు ఎదిగారు. సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో.. రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని.. తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది కేంద్రమంత్రి అయ్యారు ఈ ఎన్నికల ముందే.. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్... గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన ఆనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం..'యు వరల్డ్' ఆన్లైన్ సంస్థను ప్రారంభించి.., స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించారు. ఆ తర్వాత ఈ సంస్థ..వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతికొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం... రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం.. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో... ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్.. తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు. MBBS, MD పూర్తిచేసిన చంద్రశేఖర్ వయసు 47 ఏళ్లు. భార్య డాక్టర్ శ్రీరత్న. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు చిరపరిచితులు. చంద్రశేఖర్.. ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి... ఉస్మానియా మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించారు. పీజీ చదవడం కోసం... అమెరికా వెళ్లిన ఆయన.. అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో..వసతి, శిక్షణ కోసం అధిక వ్యయం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి... ప్రతిభ చాటారు.
అమెరికాలోని డాలస్లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. తొలి నుంచి తెలుగుదేశంతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్... ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా ఆయన పేరు ఖారరైనప్పటికీ..అప్పటి రాజకీయ పరిణామాల నడుమ.....రాయపాటి సాంబశివరావు బరిలోకి దిగారు. ప్రజలకు సేవ చేయాలన్న దృఢసంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్న పెమ్మసాని చంద్రశేఖర్.. ఇపుడు దేవుడు దాన్ని నెరవేర్చే దారిచూపాడని అన్నారు. తొలిసారి ఎంపీ అయినప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడానికి ఆమోదం తెలిపిన చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లకు పెమ్మసాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.