AP: తరలివచ్చిన అభిమానమే గెలిపించిది
తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి ఓటు ఓటు వేసిన ఓటర్లు
ఈసారి జరిగిన ఎన్నికల్లో లక్షలమంది ఓటర్లు నవ్యాంధ్రపై అభిమానంతో తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఒకరు కాదు... ఇద్దరు కాదు.. లక్షల మంది ఓటర్లు... తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, రైళ్లలో మిడతల దండులా తరలివచ్చారు. ఇతర దేశాల్లోని వారు సైతం వచ్చి తమ ఓటును వేశారు. పోలింగ్ రోజు గంటల తరబడి లైన్లలో నిల్చొని ఓట్లేశారు. కూటమి విజయంలో వీరి పాత్ర అత్యంత కీలకంగా మారింది.
గత అయిదేళ్ల వైకాపా పాలనలో గాడి తప్పిన తమ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో... ఎక్కడెక్కడి నుంచో సొంత గ్రామాల బాట పట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒకేసారి పోలింగ్కు బయల్దేరడంతో ముందు రోజు బస్సులు, రైళ్లు కిక్కిరిశాయి. అయినా వెనకాడకుండా.. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ... సొంత వాహనాలు ఏర్పాటు చేసుకొని మరీ వచ్చి ఓట్లేశారు. వీరేమీ... కూటమి కార్యకర్తలు కాదు. కూటమి అధికారంలోకి వస్తే...పదవులు అనుభవిద్దామనే ఎలాంటి ఆశలూ లేవు.
ఉద్యోగాల నిమిత్తం వలస వెళ్లిన యువత.. పనుల్లేక ఇతర ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు, రైతులు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో ఎప్పటికప్పుడు పరిశీలించుకున్నారు. ఒకవేళ తొలగిస్తే మళ్లీ నమోదు చేయాలంటూ పత్రాలు సమర్పించారు. ఓట్లు తొలగింపునకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరిగా పోలింగ్ సమయానికి లక్షల సంఖ్యలో తరలివచ్చి ఆరాచక ప్రభుత్వాన్ని సాగనంపారు. ప్రధానంగా అమెరికా, లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల్లో చాలామంది పోలింగ కొన్ని రోజుల ముందే రాష్ట్రానికి చేరుకున్నారు. అందుకోసం విమాన టికె ట్లకే వారు రూ. లక్షల్లో ఖర్చు పెట్టారు. ఇక్కడ తమకు తెలిసిన వారితో మాట్లాడారు. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే పిల్లల భవిష్యత్తు ఎంతలా దెబ్బ తింటుందో వివరించారు. ఇదే కోవలో వివిధ రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న యువతతోపాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే చిరుద్యోగులు సొంత ఖర్చులతో తరలివచ్చి మరీ ఓట్లేసి జన్మభూమిపై మమకారాన్ని చాటుకున్నారు.