రాజమహేంద్రవరం కోర్టు బయట సినిమా ఫక్కీలో ఘటన చోటుచేసుకుంది. కోర్టు శిక్ష విధించిన ఖైదీ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. విశాఖపట్నం జిల్లా గన్నవరం పంచాయతీ నాచవరానికి చెందిన లావేటి తల్లిబాబును గంజాయి కేసులో డీఆర్ఐ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. అప్పటి నుంచీ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నాడు. అతని నేరం రుజువు కావడంతో కోర్టు పదేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా విధించింది. కోర్టులో నిందితుడిని హాజరు పరిచే సమయంలో బేడీలు వేయకూడదు. దీంతో నేరస్తుడిని బయటికి తీసుకొచ్చి జైలుకు తరలించేందుకు బేడీలు వేస్తున్న క్రమంలో... తమతో కలబడి వేగంగా పారిపోయాడని ఎస్కార్టుగా వచ్చిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.