బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యకు మళ్లీ రాజ్యసభ పదవి వరించింది. ఆర్ కృష్ణయ్యను బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. గతంలో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య తన పదవీకాలం మరో నాలుగేళ్లు ఉండగానే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రాజీనామా చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అనేక బీసీ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం బీజేపీ ఆయనకు రాజ్యసభ పదవిని ఆఫర్ చేసింది. త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గాను బీజేపీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ రోజు విడుదల చేసింది. అందులో ఏపీ నుంచి మాజీ రాజ్య సభ ఎంపీ ర్యాగ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను కేంద్రం ప్రకటించింది.