"గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదు. వాహనదారులు, ప్రజలు అయిదేళ్ల పాటు నరకం చూశారు. ఈ పరిస్థితిని మార్చాలి. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలి.." అని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు.
"నాడు రోడ్ల మరమ్మతులపై కనీస మొత్తంలో కూడా నిధులు ఖర్చు చేయలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉంది. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలి. దీనికి కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరం..." అని అధికారులు వివరించారు. గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలన్నారు.
రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సీఎం చంద్రబాబు చర్చించారు. తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో, మన్నిక ఉండేలా రోడ్లు రిపేర్ చేయాలని బాబు సూచించారు.