SHARMILA: జగన్ ఇంకా ఎందుకా మౌనం
మద్యం కుంభకోణంపై షర్మిల ఆగ్రహం... కుట్రలు పూర్తిగా వెలికితీయాలని డిమాండ్... సిట్ పైనా విమర్శలు చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్;
వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ.. మద్యం కుంభకోణంపై స్పందిస్తూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్పైనా విమర్శలు గుప్పించారు. సిట్ పద్దతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. డిస్టలరీల వద్ద కమీషన్లు, బినామీలు, నగదు రవాణా అంశాలతోపాటు వైఎస్ జగన్కి నెలకు రూ. 60 కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారన్నారు. దీంతో ఈ మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివర విక్రయాల వరకు అవినీతి జరిగిందనేది అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో సైతం కేవలం నగదు రూపంలో మద్యం విక్రయాలు జరిపారని చెప్పారు. రిషి కొండను ఎందుకు తవ్వారో కూడా ఇంత వరకు వైఎస్ జగన్ సమాధానం చెప్పలేదన్నారు. వివేకా హత్యలో సాక్షి హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పిందో తెలియలేదన్నారు. జగన్ అసలు అంశాలను మరుగున పెట్టి.. మభ్యపెట్టి మాట్లాడటంలో దిట్ట అని వైఎస్ షర్మిల తెలిపారు.
బ్లాక్ మనీ కోసమే..!
కేవలం బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్లను నిలిపి వేశారని షర్మిల ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక నేరంగా ఈ మద్యం విక్రయాలను ఆమె అభివర్ణించారు. రూ. 3, 500 కోట్లు మద్యం కుంభకోణం ఒక్కటే కాదు.. పన్నులు ఎగ్గొట్టాలనే క్యాష్ పరంగా ఈ విక్రయాలు జరిపారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిగా విచారణ జరగాలని ఆమె పేర్కొన్నారు. చివరకు నాన్ డ్యూటీ పేమెంట్లు మొత్తం బ్లాక్లోనే జరిగాయని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా దత్త పుత్రుడుగానే ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి వైఎస్ జగన్ ఊడిగం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులను అదానీకి వైఎస్ జగన్ అడ్డగోలుగా కట్టెబెట్టారని గుర్తు చేశారు. బీజేపీకి వైఎస్ జగన్ ఎప్పటికీ దత్త పుత్రుడేనని వైఎస్ షర్మిల కుండ బద్దలు కొట్టారు. చీప్ లిక్కర్ తయారీని ఎందుకు ప్రోత్సహించారని జగన్ ను వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు.