ఉత్తర కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు...... ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్నట్టు తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. నిన్నటి వరకు 40డిగ్రీలకుపైన నమోదైన ఉష్ణోగ్రతలు ఇవాళ 35-40 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. వచ్చే రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు కడప, అనంతపురం, తాడిపత్రి, పొద్దుటూరు, పాణ్యంలో 42.7 డిగ్రీల.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉపరితల ద్రోణి ప్రభావం తెలంగాణలో కూడా కనిపిస్తోంది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలోని పలుజిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. ప్రధానంగా. భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, జనగామ, యాదాద్రి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలో ఇవాళ జోగులాంబ జిల్లా వడ్డేపల్లిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైనట్టు వాతావరణ విభాగం తెలిపింది.