తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీకీ మొత్తం ఇప్పటి వరకు 85 నామినేషన్లు దాఖలైనట్లుగా అధికారులు ప్రకటించారు. నేటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేడు పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్ను వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరం ఉంది.