అనంతపురంజిల్లాలో అత్యంత అరుదైన ఘటన జరిగింది. ఓ ఆలయంలో హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు దాన్ని తిరిగి తీసుకువచ్చారు. డబ్బులతో సహా ఆలయంలో వదిలేసి వెళ్లారు. బుక్కరాయసముద్రంలోని ముసలమ్మ దేవాలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జులై నెల చివర్లో ముసలమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు. డబ్బులు ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో హుండీలో సుమారు రూ.2లక్షల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.చోరీ చేసిన నగదుతో పాటు ఓ లేఖను దొంగలు ఆలయం వద్ద ఉంచి వెళ్లారు. హుండీలో నగదు దొంగిలించడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని లేఖలో పేర్కొన్నారు. దొంగలు తిరిగి తెచ్చిన నగదును ఆలయ నిర్వాహకులు లెక్కించారు. మొత్తం నగదు రూ.1,86,486 ఉన్నట్లు వారు తెలిపారు. అమ్మవారి మహత్యం వల్లే దోచుకెళ్లిన నగదును దొంగలు తిరిగి తెచ్చిపెట్టారని ఆలయ నిర్వాహకులు చెప్పారు.