Nara Lokesh : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదు.. మంత్రి లోకేశ్ స్పష్టీకరణ

Update: 2025-09-23 13:17 GMT

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆందోళనలకు మంత్రి నారా లోకేశ్ తెరదించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రణాళిక ఏదీ లేదని ఆయన శాసనమండలి వేదికగా స్పష్టం చేశారు. కర్మాగారం పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, దాని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

వైసీపీపై లోకేశ్ విమర్శలు శాసనమండలిలో రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులపై జరిగిన చర్చలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్ష వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. వాస్తవాలను తెలుసుకోకుండా విమర్శలు చేయడం ప్రతిపక్షానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలో పారిశ్రామికాభివృద్ధి ఈ సందర్భంగా, 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అనేక పెద్ద పరిశ్రమలను తీసుకువచ్చినట్లు లోకేశ్ గుర్తుచేశారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ పరిశ్రమను తీసుకురావడం ద్వారా ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయని తెలిపారు. "కియా రాకముందు అనంతపురం జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం రూ.70 వేల కంటే తక్కువగా ఉండేది. ఆ పరిశ్రమ దాని అనుబంధ యూనిట్ల రాకతో అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది" అని ఆయన వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇలాంటి పెట్టుబడులు ఎంతో కీలకమని లోకేశ్ అన్నారు.

Tags:    

Similar News