అనంతపురం జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం బుక్కరాయసముద్రం చెరువుకట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో హుండీని దొంగిలించిన వ్యక్తులు, అందులోని డబ్బును తిరిగి తెచ్చి ఆలయం వద్ద ఉంచి వెళ్లారు. అంతేకాక దొంగిలించిన డబ్బుతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని పేర్కొంటూ ఒక లేఖను కూడా అక్కడే వదిలి వెళ్లారు.
దొంగల నుంచి తిరిగి వచ్చిన నగదును ఆలయ నిర్వాహకులు లెక్కించారు. మొత్తం నగదు రూ.1,86,486 ఉన్నట్లు వారు తెలిపారు. అమ్మవారి మహత్యం వల్లే దోచుకెళ్లిన డబ్బును దొంగలు తిరిగి ఇచ్చారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.