Fake Votes: దొంగ ఓట్ల వ్యవహారం వెలుగులోకి తెచ్చిన TV5
TV5 కథనాలతో దొంగ ఓట్లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. చైతన్యపురి కాలనీలో లేని ఇంటి నెంబర్లతో దొంగ ఓట్లు వెలిశాయి.;
గుంటూరులో దొంగ ఓట్ల వ్యవహారం గుప్పుమంటోంది. నగరంలో దొంగ ఓట్ల కలకలంతో ఓటర్లు బెంబేలెత్తిపోతున్నారు. టీవీ5 కథనాలతో దొంగ ఓట్లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. చైతన్యపురి కాలనీలో లేని ఇంటి నెంబర్లతో దొంగ ఓట్లు వెలిశాయి. పలు ప్రాంతాల్లో ఒకే డోర్ నెంబరుపై సుమారుగా 246 ఫేక్ ఓట్లు బయటపడ్డాయి. ఇప్పటికే వేలాది దొంగ ఓట్లను టీవీ5 బయటపెట్టింది.
అటు గుంటూరులో దొంగ ఓట్లపై ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని గుంటూరు కార్పొరేటర్లు కలిసారు. గుంటూరులోని ఓటరు లిస్టులో అవకతవకలు, దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను ఓటర్ల ప్రక్రియలో వినియోగించొద్దని ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరు కార్పొరేటర్లు ఫిర్యాదును స్వీకరించిన ఈసీ జులై నుంచి బూత్ స్థాయి ఆఫీసర్ల ద్వారా ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలుపెడ్తామని హామీ ఇచ్చారు. అన్ని పరిశీలించిన తర్వాతే తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. దొంగ ఓట్లు, గల్లంతుపై ఎవరైనా ఎప్పుడైనా తమకు ఫిర్యాదు చేయొచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.