విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారింది. రోగులకు వారి సహాయకులకు కనీస సౌకర్యాలు లేవు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వీల్చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేవు. రోగుల బంధువులే వీల్చైర్లను వెతికి తెచ్చుకుని వైద్యుల దగ్గరకు తీసుకెళ్తున్నారు. ఎంతో కష్టపడి రోగులను ఓపీ విభాగం వరకు తీసుకెళ్తే అక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది ఉండటం లేదు.
ఆస్పత్రి ఓపీ విభాగంలో నలుగురు డాక్టర్లు ఉన్నా ఎవరూ డ్యూటీ టైంలో ఉండడం లేదు. దీంతో రోగులు గంటలపాటు వేచిచూడాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఆస్పత్రి ఆవరణలో షెల్టర్లు లేకపోవడంతో రోగుల బంధువులు వారి సహాయకులు చెట్ల కింద సేద తిరుతున్నారు. ఫ్రీ పార్కింగ్లోనూ రోగుల సహాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇన్పేషంట్ విభాగంలోనూ రోగులకు సరైన వైద్యం అందడం లేదు.
ఆస్పత్రిలోని సౌకర్యాలు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని కవర్ చేయడానికి వెళ్లిన టీవీ -5 స్టాఫ్ను పర్మిషన్ ఉందా అంటూ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇప్పుడు మాట్లాడడం కుదరదని...జూమ్ మీటింగ్లో ఉన్నానంటూ కథలు చెప్పారు. విషయాన్ని దాటవేశారు. ఆస్పత్రిలోని సౌకర్యాలపై రోగులు, వారి బంధువులు పెదవి విరుస్తున్నారు. సరైన చికిత్స అందడం లేదని వాపోతున్నారు.