ఏపీలో ఎన్డీయే కూటమి అద్భుతంగా పనిచేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లోని ఏకడమిక్ బ్లాక్ను, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గత జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆయుష్మాన్ భారత్ పథకంతో రూ. 200 కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్నా.. గత ప్రభుత్వంలో కేవలం రూ.38 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. ఇటీవల మాజీ సీఎం జగన్ పర్యటనలో చోటుచేసుకున్న ఘటనలు దారుణమని.. వేల మందితో పరామర్శలకు వెళ్లడం ఎక్కడ చూడలేదనని విమర్శించారు. పరామర్శల పేరుతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు.