Rain Alert : వాతావరణ శాఖ అలెర్ట్: మరోసారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Update: 2025-09-09 11:30 GMT

వర్షాల ప్రభావంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులు , ప్రజలకు పిడుగు లాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ లోని మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని ఆయన ప్రజలకు సూచించారు.

అదే విధంగా తెలంగాణ లోనూ ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, కొమురంభీం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News