వైసీపీ హయాంలో టీడీపీ వ్యతిరేక సోషల్ పోస్టులతో దర్శకుడు రామ్గోపాల్ వర్మపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్వర్మపై పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 19న మద్దిపాడు పీఎస్లో విచారణకు హాజరు కావాలంటూ ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లోని రామ్గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి యాక్ట్ కింద రాంగోపాల్వర్మపై నవంబర్ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణకు వర్మ వస్తారా.. లాయర్ ను పంపిస్తారా తేలాల్సి ఉంది.