Tirumala: శ్రీవారి దర్శన టికెట్లలో మోసం. .
6 టికెట్లను రూ.65 వేలకు భక్తులకు అమ్ముకున్న వైసీపీ ఎమ్మెల్సీ;
వైకాపా ఎమ్మెల్సీ జకియాఖానంపై తిరుమల రెండో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో మోసం చేశారంటూ బెంగళూరుకు చెందిన భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు రూ.65వేలు వసూలు చేశారని పేర్కొన్నాడు. బెంగళూరు భక్తులను తన లేఖ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనానికి జకియా ఖానం సిఫార్సు చేశారు. అధిక ధరకు టికెట్లు అమ్ముతున్నట్లు భక్తుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీతో పాటు ఆమె పీఆర్వో కృష్ణతేజ, చంద్రశేఖర్పై కేసు నమోదు చేశారు.
తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్కు ఫిర్యాదు చేశాడు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను బెంగళూరుకు చెందిన సాయి కుమార్కు అధిక ధరకు విక్రయించిన ఓ ప్రజాప్రతినిధి. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బ్లాక్లో వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్నట్లు ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై భక్తులు 6 టికెట్లను పొందారు. 6 టికెట్లను రూ.65 వేలకు భక్తులకు వైసీపీ ఎమ్మెల్సీ అమ్ముకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అధిక ధరకు అమ్ముకున్న ఎమ్మెల్సీపై టీటీడీ అధికారులకు భక్తుడు ఫిర్యాదు చేశాడు. విచారణలో నిర్ధారణ కావడంతో పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు చేసింది. ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లను పోలీసులు చేర్చారు.
ఇదిలా ఉండగా.. ఈ విషయంపై ఎమ్మెల్సీ జకియా ఖానం స్పందించారు. తాను టీడీపీలో చేరుతున్నాననే విషయం తెలుసుకుని వైసీపీ నేతలు తనపై కుట్రపన్నారని ఆమె ఆరోపించారు. అందులో భాగంగానే తన లెటర్ను మిస్యూజ్ చేశారన్నారు. తన లెటర్ను డబ్బులకు ఇచ్చిన విషయం కూడా తనకు తెలియదన్నారు. పోలీసులు సమాచారం ఇవ్వడం వల్లే తనకు తెలిసిందన్నారు. కొందరు వైసీపీ నేతలు తనపై పని పెట్టుకుని కుట్రలో ఇరికించారన్నారు. నిజాయితీగా ఉండేవారికి వైసీపీలో గౌరవం లేదన్నారు. మైనార్టీ మహిళలకు వైసీపీలో గౌరవం లేదన్నారు. మా పీఆర్వో సెలవులో వెళ్లడంతో ఆ లెటర్ను ఎవరు ఎవరికి ఇచ్చారనేది తనకు తెలియదని ఎమ్మెల్సీ జకియా ఖానం స్పష్టం చేశారు.