పసుపు పంటకు ఆల్టైమ్ రికార్డు ధర పలికింది. నిజామాబాద్లో క్వింటా పసుపు ధర గరిష్ఠంగా రూ.18,299 పలికింది. పెర్కిట్కు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతు పంటకు ఈ ధర లభించగా.. ఇటీవల పెరుగుతున్న ధరలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు కనిష్ఠ ధర రూ.8,000, సగటు ధర రూ.14,250 పలికింది.
గడిచిన పందేడ్లల్లో 7వేలు కూడా దాటని పసుపు ధర.. ఈసారి అనూహ్యంగా మూడు రేట్లు పెరిగింది. నిజామాబాద్ మార్కెట్లో 2011 తర్వాత ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. 2011లో క్వింటా పసుపు ఆల్టైమ్ రికార్డు ధర రూ.16,166 పలికింది.
ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా రూ.6-7 వేల మధ్యనే పసుపు ధరలు పలికాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో ఉడికించి పూర్తిగా ఆరబెట్టిన పాలిష్ పసుపునకు క్వింటాల్ రూ.18,900 దాకా ధర పలుకుతున్నది. దాంతో బాల్కొండ, ఆర్మూర్ సెగ్మెంట్ రైతులు అటు వరుస కట్టారు. పసుపు పంటకు రోజురోజుకూ ధరలు పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు