అల్లం, వెల్లుల్లి ధరలు ఆగడం లేదు. కనీవినీ ఎరుగని రీతిలో ఆకాశన్నంటాయి. ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర రూ.550 మార్క్ దాటింది. అటు అల్లం కూడా రూ.350కి చేరింది.
గత నవంబర్ మిడ్ నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి, అల్లం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్లో హోల్సేల్ మారెట్లో అత్యంత నాణ్యమైన వెల్లుల్లి ధర రూ.250 ఉండగా రిటైల్ మారెట్లో రూ.400 వరకు పలికింది. ప్రస్తుతం కేజీ ఎల్లిగడ్డ రూ.500కి ఎగబాకింది. అల్లం ధరలు కూడా కేజీ రూ.350 వరకు పలుకుతుండటం వినియోగదారుల్లో ఆందోళన పెంచుతోంది. మెట్రో నగరాల్లో వెల్లుల్లి ధర కిలో రూ.500-550 మధ్య అమ్ముతున్నారు.
ఈ రేట్లతో హోటల్ యజమానుల రాబడి తగ్గిందనే వాదన వినిపిస్తోంది. అల్లం,వెల్లుల్లి తగ్గిస్తే తమ వంటల్లో రుచి తగ్గుతుందని అక్కడ రాజీ పడలేమని చెబుతున్నారు మెట్రో నగరాల్లోని హోటల్ యజమానులు. మరో నెల రోజులు గడిస్తే గానీ కొత్త పంట మార్కెట్ లోకి రాదు. దీంతో.. ఇంకొద్దిరోజుల పాటు ఓపిక పడతామంటున్నారు.