IPO : 2026లో రూ.2.55 లక్షల కోట్ల మెగా లక్ష్యం.. ఐపీవోలు తెచ్చేందుకు క్యూలో 200 కంపెనీలు
IPO : భారతీయ స్టాక్ మార్కెట్లో కొంత అస్థిరత ఉన్నప్పటికీ కంపెనీలు ప్రైమరీ మార్కెట్ (IPO)లోకి రావడానికి వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం..2025 సంవత్సరం ఐపీఓలకు ఒక బ్లాక్బస్టర్ విజయంగా నిలిచింది. ఈ ఏడాది దాదాపు 100 భారతీయ కంపెనీలు మెయిన్బోర్డ్ ఆఫరింగ్ల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.77 లక్షల కోట్లకు పైగా నిధులు సేకరించాయి. ఇది 2007 తర్వాత వచ్చిన అత్యధిక ఐపీఓల సంఖ్య. ఈ ఉత్సాహంతో రాబోయే 2026 సంవత్సరానికి ఏకంగా రూ.2.55 లక్షల కోట్లకు పైగా ఐపీఓల కోసం కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. 2024లో రూ.1.6 లక్షల కోట్లు, 2023లో రూ.49,500 కోట్లు మాత్రమే సమీకరించగా, ఈ తాజా పెరుగుదల మార్కెట్ వేగాన్ని సూచిస్తోంది.
2026 సంవత్సరానికి ఐపీఓల క్యూ చాలా పెద్దదిగా ఉంది. ఇప్పటికే 88 కంపెనీలు సుమారు రూ.1.16 లక్షల కోట్ల నిధుల కోసం సెబీ నుంచి అనుమతి పొందాయి. అంతేకాకుండా, మరో 104 కంపెనీలు దాదాపు రూ.1.4 లక్షల కోట్లు సమీకరించడానికి సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. అంటే మొత్తం సుమారు 200 కంపెనీలు 2026లో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. పెట్టుబడిదారుల నుంచి సానుకూల ధోరణి, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ తమ పెట్టుబడులను విక్రయించడానికి ఆసక్తి చూపడం, స్థూల ఆర్థిక వ్యవస్థలో సానుకూల వాతావరణం వంటి కారణాల వల్ల ఐపీఓల సంఖ్య ఇంత భారీగా పెరగడానికి దోహదపడుతోంది. అలాగే, ఈ ఏడాది ప్రమోటర్లు, పీఈ సంస్థలు, వీసీ ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.1.1 లక్షల కోట్లకు పైగా షేర్లను విక్రయించారు, ఇది బలమైన డిమాండ్ను సూచిస్తుంది.
రాబోయే సంవత్సరంలో ఐపీఓల రంగంలోకి ప్రవేశించే ప్రధాన కంపెనీలపై పెట్టుబడిదారులు కన్నేసి ఉంచారు. ముఖ్యంగా ఎన్ఎస్ఈ , రిలయన్స్ జియో, మణిపాల్ హాస్పిటల్స్ వంటి పెద్ద కంపెనీలతో పాటు, ఫోన్పే (ఇది ఇప్పటికే రూ.10,000 కోట్ల ఇష్యూ కోసం డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేసింది) లిస్టింగ్ అత్యంత ఆసక్తికరంగా మారింది. జెప్టో, బోట్, ఆఫ్బిజినెస్, కోర్ఫుడ్స్ వంటి కొత్త కంపెనీలు కూడా ఐపీఓల క్యాలెండర్లో చేరే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ బలమైన స్థితి, కొత్త వెంచర్లు, బలమైన రిటైల్ ఇన్వెస్టర్ బేస్ కారణంగా ఈ భారీ ఐపీఓ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఐపీఓల జోరు, పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.