భారత విమానయాన సంస్థలకు చెందిన ఫ్లైట్లలో ఈ ఏడాది జులైలో కోటి 29 లక్షల మంది ప్యాసింజర్లు జర్నీ చేశారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.30% ఎక్కువ అని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జూన్లో దేశీయ విమానయాన సంస్థలు తీసుకెళ్లిన 1.32 కోట్ల మందితో పోలిస్తే జులైలో విమానాల్లో రద్దీ తక్కువగా ఉంది. ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ దేశీయ ఎయిర్ ట్రాఫిక్లో ఆధిపత్యాన్ని కొనసాగించింది. జులైలో దాని మార్కెట్ వాటా 62 శాతానికి పెరిగింది. ఎయిర్ ఇండియా వాటా 14.30 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన డేటా ప్రకారం.. జులైలో ‘విస్తారా’కు సంబంధించిన దేశీయ మార్కెట్ వాటా 10 శాతానికి చేరుకుంది. ఏఐఎక్స్ కనెక్ట్, స్పైస్జెట్ల వాటా 4.50 శాతం, 3.10 శాతం వరకు మాత్రమే ఉంది. అలాగే, ఆకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్ల వాటా 4.70, 0.90 శాతం నమోదైంది.