ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి జులై 31 తో గడువు ముగియనుంది, ఇంకా మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఐటీ వెబ్ సైట్ ప్రకారం జులై 14 నాటికి 2.7 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. క్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. ఐటీఆర్ ఫైలింగ్ ఇప్పటికీ అనేకమంది సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఈ-ఫైలింగ్ సైట్లోకి లాగిన్ ఇబ్బందులు, పాస్వర్డ్ రీసెట్ నుంచి ఐటీఆర్ ఫారాల్లో ముందే నింపి ఉన్న సమాచారంలో తప్పుల వరకు అనేక సమస్యలు ఉంటున్నాయి. ఈ-వెరిఫికేషన్ లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్లు సహా ఆర్థిక రంగంలోని నిపుణులు ఈ విషయాన్ని ఆదాయపు పన్ను విభాగం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కర్ణాటక చార్టెడ్ అకౌంటెంట్ల సమాఖ్య ఐటీ ఫైలింగ్ లో తలెత్తుతున్న కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అవ్వడంలో కీలక ఫారాలను డౌన్లోడ్ చేసుకోలేకపోవడం, పోర్టల్ లోని సమాచారం, ఫారం 26ఏఎస్, ఏఐఎస్ లోని వివరాల మధ్య వ్యత్యాసం ఏఐఎస్, టీఐఎస్ రెస్పాన్స్ ను సమర్పించేటప్పుడు ఆలస్యం, ఫెయిల్యూర్ పాస్వర్డ్ రీసెట్టింగ్ లో ఇబ్బందులు పన్ను చెల్లింపు చలాన్ జనరేషన్లో సమస్య, ఫైలింగ్ సమర్పించే సమయంలో ఎర్రర్ మెసేజ్లు, దాఖలు చేసిన పన్ను రిటర్నులను ఈ-వెరిఫై చేయడంలో ఇబ్బందులు, బహుళ ఓటీపీల జనరేషన్, ఐటీఆర్ రిసీట్ డౌన్ లోడ్ సమస్యలు, .. ఇలాంటివి చాలావరకు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో.. గడువు పొడిగించాల్సి రావొచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.