LIC IPO: ఎల్ఐసీ పాలసీదారులు రాబోయే పబ్లిక్ ఇష్యూలో (ఐపీవో) షేర్లు కొనుగోలు చేసేందుకు ఫిబ్రవరి 28లోగా పాన్ కార్డు వివరాలను తెలియజేయాలి. దీనికి సంబంధించిన వివరాలను పాలసీ రికార్డులో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెబీకి దాఖలు చేసిన ముసాయిదాలో సంస్థ ఈ విషయం పేర్కొంది.
పాన్ కార్డ్ వివరాలను ఎల్ఐసీ వద్ద అప్డేట్ చేసుకోని పాలసీదార్లను షేర్ల కొనుగోలుకు అనర్హులుగా ప్రకటిస్తారు. కంపెనీ వెబ్సైట్లో నేరుగా లేదా ఏజంట్ సహాయంతో అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది.
డీఆర్హెచ్పీ దాఖలు చేసే నాటికి బిడ్/ఆఫర్ ప్రారంభమయ్యే తేదీ నాటికి ఒకటి లేదా అంతకు మించి పాలసీలు ఉన్నవారు.. పాలసీ హోల్డర్ రిజర్వేషన్ పోర్షన్ కింద షేర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులై ఉంటారు. వారికి డీమ్యాట్ ఖాతా ఉండాలి. ఇష్యూలో దాదాపు 10 శాతం వరకు పాలసీదారుల కోసం కేటాయించవచ్చని, సాలసీ హోల్డర్లకు ఐపీవో ఇష్యూ ధరలో దాదాపు 10 శాతం వరకు డిస్కౌంటు లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. ఐపీవో కింద ఎల్ఐసీలో 5% వాటి (31.6 కోట్ల షేర్లు) విక్రయించనుంది. దీని విలువ దాదాపు రూ.63,000 కోట్లుగా ఉంటుందని, ఇష్యూ మార్చిలో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.