Maruti e-Vitara : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కి.మీ ప్రయాణం.. రూ.10.99 లక్షలకే మారుతి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.
Maruti e-Vitara : భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో సరికొత్త యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ మోడల్తో దూసుకుపోతున్న ఎంజీ విండ్సర్ ఈవీకి చెక్ పెట్టేందుకు మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ-విటారాను లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.10.99 లక్షలు (BaaS విధానంలో)గా నిర్ణయించారు. దీనికి అదనంగా బ్యాటరీ కోసం కిలోమీటరుకు రూ.3.99 చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మోడల్ రాకతో విండ్సర్ ఈవీ ఆధిపత్యానికి గట్టి పోటీ ఎదురుకానుంది.
మారుతి ఈ-విటారాను బుక్ చేసుకోవాలనుకునే వారు రూ.21,000 చెల్లించి నెక్సా షోరూమ్లలో లేదా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీ తన ప్లాంట్లో ఈ కారును తయారు చేసి సుమారు 200 దేశాలకు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ కారు ద్వారా సామాన్యులకు కూడా ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకురావడమే మారుతి లక్ష్యం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి మోడళ్లకు కూడా ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
మారుతి సుజుకి చరిత్రలోనే అత్యంత ప్రీమియం కారుగా ఈ-విటారా నిలిచిపోనుంది. దీని డిజైన్ చాలా క్లీన్ అండ్ మోడ్రన్గా ఉండి, రోడ్డుపై అద్భుతమైన రూపాన్ని కలిగి ఉంది. 4.27 మీటర్ల పొడవుతో విశాలమైన క్యాబిన్ స్పేస్ను అందిస్తుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే.. 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్స్క్రీన్, హర్మాన్ ఆడియో సిస్టమ్ మరియు వెంటేలేటెడ్ సీట్లతో ఈ కారు లగ్జరీ అనుభూతిని ఇస్తుంది. ఫిక్స్డ్ గ్లాస్ సన్రూఫ్ దీనికి మరో ప్రధాన ఆకర్షణ.
ఈ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది (49kWh, 61kWh). టాప్ వేరియంట్ 543 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సేఫ్టీ కోసం మారుతి ఇందులో మొదటిసారి లెవెల్-2 ADAS ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో 7 ఎయిర్బ్యాగ్లు, 360-డిగ్రీల కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అత్యంత సురక్షితమైన ఫీచర్లు ఉన్నాయి. 50 శాతానికి పైగా హై-టెన్సైల్ స్టీల్తో నిర్మించిన ఈ కారు, బ్యాటరీకి ప్రత్యేక రక్షణ వ్యవస్థను కూడా కలిగి ఉంది.