US: సోషల్ మీడియా వివరాలు లేనివారికి నో వీసా !

అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..?;

Update: 2025-06-28 05:00 GMT

అమెరికా వీసా పొందాలనుకునే అభ్యర్థులకు సోషల్ మీడియా కీలకమైన ప్రమాణంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ప్రకారం.. అభ్యర్థులు గత ఐదేళ్లలో ఉపయోగించిన తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సిన నిబంధన ఉంది. దీన్ని DS-160 ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఓ నియమంగా కాకుండా, అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాలను పరీక్షించే ఓ స్క్రీనింగ్‌ టూల్‌గా పనిచేస్తోంది. అభ్యర్థులు వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఈ సమాచారాన్ని సమర్పించకపోతే, వారి దరఖాస్తు తిరస్కరించే అవకాశముంది. అలాగే, వారి ఖాతాల్లో ఉన్న పోస్టులు, కామెంట్లు, లైకులు ఆధారంగా అమెరికా అధికారులు అభ్యర్థి గురించి నెగెటివ్ అభిప్రాయం ఏర్పరచుకుంటే, అమెరికా ప్రవేశాన్ని నిరాకరించే అవకాశాలు అధికంగా ఉంటాయి.

    ఈ నేపథ్యంలో, నార్వేకు చెందిన మాడ్స్ మికెల్సెన్ అనే యువకుడి ఉదాహరణ ప్రస్తావించుకోవచ్చు. అతని ఫోన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను బట్టతలగా చూపించిన మీమ్ వల్ల అతని వీసా నిరాకరించబడింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో, భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలి. వీసా దరఖాస్తు చేసేవారు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను పరిశుభ్రంగా, బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చర్యలు అంతర్జాతీయ విద్యార్థుల, వలసదారుల ప్రవేశాన్ని నియంత్రించేందుకు తీసుకున్న ప్రయత్నాల్లో భాగంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పౌరసురక్షణను మెరుగుపర్చే దిశగా ఈ చర్యలను అమెరికా ప్రభుత్వం సమర్థించుకుంటోంది. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. వీసా కోసం దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ ఆన్లైన్ ప్రవర్తనను విశ్లేషించుకోవడం, అసభ్యమైన, విద్వేషపూరిత విషయాల నుండి దూరంగా ఉండటం అత్యంత అవసరం.

Tags:    

Similar News