WOMEN EMPOWER: ఆర్థిక వ్యవస్థపై శక్తిమంత మహిళల ప్రభావం
"కాండెరే హురున్" మహిళా నేతల జాబితా...2025 జాబితా విడుదల చేసిన హురున్...97 మంది శక్తిమంత మహిళలకు స్థానం;
భారత్లో మహిళా పారిశ్రామికవేత్తల ప్రాభవం దినదినాభివృద్ధి చెందుతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా, '2025 కాండేర్ హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్' నిలిచింది. ఈ జాబితాలో ఉన్న 10 మంది తొలి తరం మహిళా వ్యాపారవేత్తల సంపద రూ.2 లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్, హెల్త్కేర్, రిటైల్, ఫైనాన్స్ వంటి రంగాల్లో వారు బిలియన్ డాలర్ల విలువగల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించగలిగారు. ఈ జాబితాలో జోహో కార్పొరేషన్ సహవ్యవస్థాపకురాలు రాధా వెంబు రూ.55,300 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ఆమెను అనుసరిస్తూ అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ రూ.48,900 కోట్ల సంపదతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలోని టాప్ 10 మహిళల్లో ఏడుగురు భారత్లో నివసిస్తుండగా.. మిగిలిన ముగ్గురు అమెరికాలో నివాసం ఉంటున్నారు.
మహిళల సత్తా
రూ.3.81 లక్షల కోట్ల విలువ కలిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా శాంతి ఏకాంబరం వ్యవహరిస్తున్నారు. మహిళా వృత్తి నిపుణుల్లో ఈమెకు జాబితాలో అగ్రస్థానం లభించింది. రూ.1.44 లక్షల కోట్ల విలువైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న పర్మీందర్ చోప్రా తదుపరి స్థానంలో ఉన్నారు. రిలయన్స్ రిటెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశా అంబానీ 6వ స్థానంలో ఉన్నారు. అంకుర సంస్థ మృచా బ్యూటీ వ్యవస్థాపకురాలు, ఇన్స్టాగ్రామ్లో 55 లక్షల మంది ఫాలోవర్లను కలిగిన మృణాల్ పంచాల్, ఇన్ఫ్లుయెన్సర్ వ్యవస్థాపకుల్లో తొలిస్థానంలో నిలిచారు.