OFFICES: హైదరాబాద్లో ఆఫీస్ స్థలాలకు ఫుల్ డిమాండ్
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో పెరిగిన గిరాకీ.. 23% వృద్ధితో 32 లక్షల చ.అ. స్థలాల లీజింగ్;
ప్రపంచ స్థాయి నగరాల్లో మన హైదరాబాద్ ఒకటి. అన్ని రంగాల్లో భాగ్యనగరం దూసుకెళ్తోంది. ఉపాధి కోసం వచ్చిన వారిలో చాలా మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకోవడం నగరంలో ఇళ్లు, స్థలాలకు డిమాండ్ ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఐటీ రంగం కీలకమైంది. హైదరాబాద్ స్థిరాస్తికి ఐటీ బూస్ట్లా మారింది. ఐటీ ఉద్యోగులపై ఆధారపడి గృహ విక్రయాలు ఎంత జరుగుతాయో.. అంతకు రెట్టింపు స్థాయిలో ఐటీ సంస్థల లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో హైదరాబాద్ దూసుకువెళ్తోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది.
7 ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలాలకు గిరాకీ
ఈ ఏడాది 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలాలకు గిరాకీ పెరిగినట్లు కొలియర్స్ నివేదిక తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణె నగరాల్లో ఆఫీసు స్థలాలకు గిరాకీ పెరిగినట్లు నివేదిక తెలిపింది. అయితే, ముంబైలో మాత్రం గిరాకీ కాస్త తగ్గినట్లు పేర్కొంది. 2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కార్యాలయాల స్థలాల లీజింగ్ 161 లక్షల చదరపు అడుగులు ఉండగా.. ఈ ఏడాది 11 శాతం మేర పెరిగి 178 లక్షల చదరపు అడుగులకు చేరినట్లు నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నా భారత్లో కార్పొరేట్ కంపెనీల సానుకూల దృక్పథానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొంది. వచ్చే డిసెంబర్ నాటికల్లా ఆఫీసు స్థలాల గిరాకీ 65-75 మిలియన్ చదరపు అడుగులకు చేరవచ్చని కొలియర్స్ ఇండియా ఎండీ అర్పిత్ మెహ్రోత్రా అంచనా వేశారు.
ఆయా నగరాల్లో లీజుకు ఆఫీసు స్థలాలు
బెంగళూరులో ఏప్రిల్- జూన్ 2025 త్రైమాసికంలో స్థిరంగా 48 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసు స్థలాలు లీజుకు వెళ్లాయి. చెన్నైలో 30 శాతం వృద్ధితో 26 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్ జరిగింది. ఢిల్లీలో 16 శాతం వృద్ధితో 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల స్థలాల లీజింగ్ జరిగింది. హైదరాబాద్లో 23 శాతం వృద్ధితో 32 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాల లీజింగ్ జరిగింది. కోల్కతాలో 100 శాతం వృద్ది నమోదు చేసింది. 6 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాల లీజింగ్ జరిగింది. ఇక పుణెలో 60 శాతం పెరిగి 16 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.
పెరిగిన ఇళ్ల ధరలు.. తగ్గిన విక్రయాలు
మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో ఇళ్ల ధరలు సగటున 11% పెరిగాయని.. ఇదే సమయంలో విక్రయాలు 20% తగ్గాయని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. 2024 ఏప్రిల్-జూన్లో 1,20,335 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయం కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో 96,285 మాత్రమే అమ్ముడయ్యాయని తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూరు, పుణె, కోల్కతా నగరాల్లో గృహ విక్రయాలు తగ్గాయి. కాగా, హైదరాబాద్లో అమ్మకాలు 15,085 యూనిట్ల నుంచి 11,040 యూనిట్లకు పడిపోయా యి. చెన్నైలో మాత్రం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు 11 శాతం పెరిగాయని అనరాక్ చైర్మన్ అనూజ్ పురి వెల్లడించారు.