Tata Motors : ఇక డీజిల్ గోల వద్దు, పెట్రోల్ పవర్తో రాబోతున్న టాటా హారియర్, సఫారీ
Tata Motors : టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికల్స్ రాబోయే కాలంలో పలు కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్లాన్లలో ముఖ్యంగా అందరూ ఎదురుచూస్తున్నది టాటా హారియర్, సఫారీ ఎస్యూవీల పెట్రోల్ వేరియంట్లు. ప్రస్తుతం ఈ రెండు ఎస్యూవీలు భారతదేశంలో కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో మాత్రమే లభిస్తున్నాయి. వాటిలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
త్వరలో రాబోయే టాటా సఫారీ, హారియర్లలో 1.5 లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజిన్కు కంపెనీ హైపెరియన్ అనే పేరు పెట్టింది. ఆటో ఎక్స్పో 2023లో ఈ ఇంజిన్ను తొలిసారిగా ప్రదర్శించారు. ఈ పెట్రోల్ ఇంజిన్ దాదాపు 170 హార్స్పవర్ ఎనర్జీని, 280 Nm టార్క్ను ఉత్పత్తి చేయగలదని భావిస్తున్నారు. ఈ ఇంజిన్తో పాటు డ్యూయల్-క్లచ్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గియర్బాక్స్ ఇవ్వవచ్చు. ఈ పవర్ట్రైన్కు సంబంధించిన పూర్తి వివరాలు నవంబర్ 25న టాటా సియెరా అధికారిక లాంచ్తో పాటు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ రాకతో హారియర్, సఫారీ మార్కెట్లో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోగలవు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ఉన్న చాలా ఎస్యూవీలు పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో లభిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ ఇంజిన్ అందుబాటులోకి వస్తే, ఈ రెండు కార్ల ధరలు ప్రస్తుతం ఉన్న డీజిల్ వేరియంట్ల కంటే కొంత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇది మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి దోహదపడుతుంది.
ప్రస్తుతం టాటా హారియర్, సఫారీలలో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ లభిస్తోంది. ఇది 167 హార్స్పవర్, 350 Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గియర్బాక్స్తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం సఫారీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.66 లక్షలు కాగా, హారియర్ ప్రారంభ ధర రూ. 14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
భారత మార్కెట్లో హారియర్ జీప్ కంపాస్, ఎంజీ హెక్టర్ వంటి ఎస్యూవీలతో పోటీ పడుతోంది. మూడు వరుసల సీట్లు కలిగిన సఫారీ, మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కాజార్, జీప్ మెరిడియన్లతో పోటీ పడుతోంది.