TRADE DEAL: ఈ నెలలోనే భారత్-అమెరికా ట్రేడ్ డీల్!
టారిఫ్ల తగ్గింపు, మార్కెట్ అందుబాటు, డిజిటల్ వాణిజ్యం పెంపు దిశగా భారత్-అమెరికా మధ్య చర్చలు;
భారత్, అమెరికా దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. టారిఫ్ల తగ్గింపు, మార్కెట్ అందుబాటు, డిజిటల్ వాణిజ్యం పెంపు దిశగా జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని వారాల్లోనే ఇరుదేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరనుందని తెలుస్తోంది. వాణిజ్య అంశాలపై ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ఢిల్లీ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన కీలక చర్చలు ముగిశాయి. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న 190 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని.. 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్నాయి. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ అందుబాటును పెంచడం, సుంకాలు తగ్గించడం, టారిఫ్ మినహాయింపులు వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధాన అజెండాగా సాగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా, సమతుల్య ఒప్పందం దిశగా చర్చల్లో మెరుగైన పురోగతి లభించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అమెరికా డిమాండ్లను తిరస్కరించిన భారత్
వ్యవసాయ దిగుమతులకు సంబంధించి అమెరికా చేసిన డిమాండ్లను భారత్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇది భారతదేశంలోని రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో నిబద్ధతను చూపుతుంది. మరోవైపు ఉక్కుపై వాషింగ్టన్ విధించిన 50 శాతం సుంకం నుంచి భారత్ను మినహాయించాలని కోరింది. దీనికి బదులుగా అమెరికా నుంచి సీఎన్జీ, క్రూడాయిల్, బొగ్గు దిగుమతులను పెంచుకుంటామని భారత్ ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మోదీ-ట్రంప్ భేటీ రోజే క్లారిటీ!
ఈనెల 15-17 మధ్య కెనడా వేదికగా జరగనున్న జీ7 సదస్సు ఈ వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు దిద్దే అవకాశం ఉందని సమాచారం. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉంది. ఆ భేటీలోనే వాణిజ్య ఒప్పందంపై వీరిద్దరూ చర్చించుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే మధ్యంతర ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ కీలక ట్రేడ్ డీల్ను అధికారికంగా ప్రకటించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.