AIRLINES: విదేశీ ప్రయాణం ఇక మరింత సులభం

భారతీయ నగరాలకు విస్తరిస్తున్న విదేశీ ఎయిర్‌లైన్స్‌;

Update: 2025-06-09 08:00 GMT

భారత్‌లో విమాన ప్రయాణం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, విదేశీ ఎయిర్‌లైన్స్‌ తమ సేవలను మరిన్ని భారతీయ నగరాలకు విస్తరిస్తున్నాయి. ఇప్పటివరకు దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాలకు మాత్రమే అందుబాటులో ఉన్న అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇతర నగరాలకూ విస్తరిస్తున్నాయి.

కోడ్‌ షేరింగ్‌ ఒప్పందాలు – ప్రయాణానికి కొత్త సౌలభ్యం

విదేశీ సంస్థలు, భారతీయ విమానయాన సంస్థలతో కోడ్‌ షేరింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకుని ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడానికి సిద్ధమవుతున్నాయి.

ఉదాహరణకు:

డెల్టా ఎయిర్‌లైన్స్ అట్లాంటా–దిల్లీ మధ్య నాన్‌స్టాప్‌ సర్వీసు ప్రారంభించడంతోపాటు, ఇండిగోతో కోడ్‌షేరింగ్‌ ఒప్పందం చేసుకుంది. ఎయిర్‌ ఫ్రాన్స్‌–కేఎల్‌ఎం, వర్జిన్‌ అట్లాంటిక్‌ వంటి సంస్థలు కూడా ఇండిగోతో చేతులు కలిపాయి. ఈ ఒప్పందాల ద్వారా ప్రయాణికులు ఒకే టికెట్‌తో అంతర్జాతీయ గమ్యస్థానం నుంచి స్వదేశ నగరానికి చేరవచ్చు. విమానం ఆలస్యం అయినా, సంబంధిత సంస్థ ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పిస్తుంది. బ్యాగేజీ చెకింగ్‌ కూడా సులభతరం అవుతుంది.

భారత విమానయాన రంగానికి పెరుగుతున్న డిమాండ్‌

భారత్‌ ఇప్పటికే ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమాన మార్కెట్‌గా ఎదిగింది. ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణాల విస్తరణతో వేగంగా ముందుకు సాగుతోంది.

అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణ

2023లో 5.5 కోట్ల మంది అంతర్జాతీయంగా ప్రయాణించగా, 2024లో ఇది 7.2 కోట్లకు పెరిగింది. అంతర్జాతీయంగా అమెరికా (18%), చైనా (16.7%) తర్వాత భారత్‌ వాటా 4.2% గా ఉంది. 2044 నాటికి భారతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 42.5 కోట్లకు చేరుతుందని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్ (IATA) అంచనా వేసింది.

ప్రయాణికులకు ప్రధాన ఆకర్షణ – తక్కువ ధర

భారత్‌లో ఎక్కువగా ప్రయాణికులు తక్కువ ధరల విమాన సర్వీసులను ఇష్టపడతున్నారు. దేశవ్యాప్తంగా విమాన సీట్లలో 71% చౌక ధరల సంస్థలదే. ప్రస్తుతంగా 150 విమానాశ్రయాలు ఉండగా, 2047 నాటికి 350 విమానాశ్రయాలు ఏర్పాటుచేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

Tags:    

Similar News