రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ (Arundathi Nayar) పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నట్లు సోదరి ఆర్తీ తెలిపారు. తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా రక్తం గడ్డకట్టడంతో ఇటీవల బ్రెయిన్ సర్జరీ చేసినట్లు చెప్పారు. పక్కటెముకల శస్త్రచికిత్సకు కావాల్సిన సాయం చేయాలని ఆమె కోరారు. రోజుకు ₹2లక్షల చొప్పున ఇప్పటివరకు రూ.40 లక్షలు ఖర్చైనట్లు పేర్కొన్నారు.
మార్చి 14న ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్దిరోజులుగా అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది.
కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్ శివానందికమ్, సైతాన్, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఒట్టకోరు కాముకన్ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్ థింక్ అనే వెబ్ సిరీస్ల్లోనూ యాక్ట్ చేసింది.