డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ నెల 27న విడుదల కాబోతోన్న ఈ మూవీ కోసం ఇప్పటికే ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు విష్ణు. దేశమంతా తిరగుతూ కన్నప్పను ప్రమోట్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో విష్ణు ఓ ఎమోషనల్ ట్వీట్ వేశారు. తన తనయుడు అవ్రామ్ మంచు తెరంగేట్రం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్ బాబు, విష్ణు మంచు, విష్ణు మంచు కొడుకు అవ్రావ్, కుమార్తెలు అరియానా -వివియానా నటించడం ఓ రేర్ ఫీట్. ఇలా మూడు తరాలు కలిసి నటించిన అతి కొద్ది చిత్రాల్లో ‘కన్నప్ప’ నిలిచింది.
అవ్రామ్ ‘కన్నప్ప’ చిత్రంలో తిన్నడు చిన్నప్పటి పాత్రలో కనిపిస్తారు. ట్రైలర్లోనూ అవ్రామ్కు సంబంధించిన సీన్లు ఉన్నాయి. ఇక ఈ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని విష్ణు మంచు షేర్ చేశారు. ‘‘కన్నప్ప’తో నా తనయుడు అవ్రామ్ తెరంగేట్రం చేస్తున్నారు. అవ్రామ్ సెట్లోకి అడుగు పెట్టడం, కెమెరా ఎదుట నిల్చోవడం, డైలాగ్స్ చెప్పడం.. ఇలా ప్రతీదీ నా జీవితంలో భావోద్వేగపూరితమైన క్షణాలు. ఓ తండ్రిగా, ఒకప్పుడు నేను కలలుగన్న అదే ప్రపంచంలోకి నా తనయుడు అడుగు పెట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ఆనందానికి ఏదీ సాటి రాదు.. ఇది అవ్రామ్ తెరంగేట్రం మాత్రమే కాదు.. నా జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. నాపై చూపించిన ప్రేమాభిమానాలే నా కుమారుడిపైనా చూపిస్తారని భావిస్తున్నాను. అవ్రామ్ ప్రయాణం ‘కన్నప్ప’తో మొదలైంది’ అని విష్ణు ట్వీట్ వేశారు.
అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాతగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ‘కన్నప్ప’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, బ్రహ్మానందం వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రల్ని పోషించారు. జూన్ 27న కన్నప్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.