Vijay Deverakonda : వివాదంలో విజయ్ దేవరకొండ.. ఎస్సీ, ఎస్టీ కేసు డీటెయిల్స్ ఇవే!
టాలీవుడ్ లైగర్ విజయ్ దేవరకొండ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. పహల్గాంలో జరిగిన తాజా ఉగ్రవాద దాడిని 500 సంవత్సరాల క్రితం జరిగిన తెగల మధ్య ఘర్షణలతో పోలుస్తూ.. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జూన్ 17న ఎస్సీ, ఎస్టీ చట్టం కింద విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. అయితే, ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ రాష్ట్ర అధ్యక్షుడు నెనవత్ అశోక్ కుమార్ నాయక్ (అశోక్ రాథోడ్) ఫిర్యాదు చేశారు. సూర్య నటించిన రెట్రో చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో నటుడు చేసిన వ్యాఖ్యలు ఆదివాసీ సమాజాల భావాలను దెబ్బతీశాయని, తీవ్రమైన అవమానం కలిగించాయని ఆయన ఆరోపించారు. ఆదివాసులను పాకిస్థానీ ఉగ్రవాదులతో పోల్చడం జాతి వివక్షగా ఉందని రాథోడ్ అన్నారు.
"పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదు. అక్కడ ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వంపై వాళ్లే ఎటాక్ చేస్తారు" అని ఆయన అన్నారు. ఆ సందర్భంలోనే, “కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే.. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లో "500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్టుకున్నట్లు" అనే పదజాలం పైనే ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాటలు ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వారిని అమర్యాదగా చిత్రీకరించేలా ఉన్నాయని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపూనగర్ అధ్యక్షుడు కిషన్రాజ్ చౌహాన్ కిషన్ సహా పలు గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విజయ్ దేవరకొండ ఆదివాసులను, గిరిజనులను కించపరిచేలా, వారి నాగరికతను ప్రశ్నించేలా మాట్లాడారని ఆరోపించారు. ఆదివాసీలు అనాగరికులు కారని, వారికి కూడా తమదైన జీవన శైలి, సంస్కృతి, చరిత్ర ఉన్నా యని గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ వ్యాఖ్యలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నేరమని పేర్కొంటూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగానే రాయ దుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.